కొన్ని నెలలుగా జీతం ఇవ్వట్లేదని మంత్రినే కాల్చిచంపిన దారుణ ఘటన ఉగాండాలో మంగళవారం జరిగింది. ఉగాండా కార్మిక శాఖ సహాయమంత్రి చార్లెస్ ఎంగోలా ఆ దేశ రాజధాని కంపాలాలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయనను మంగళవారం ఉదయం ఆయన బాడీగార్డులలోని విల్సన్ సబిటి అనే వ్యక్తి గన్తో కాల్చాడు. విల్సన్ పాయింట్ రేంజ్ బ్లాంక్ లో ఎంగోలాను కాల్చడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదంతా చూసిన మిగతా బాడీగార్డులు షాక్కు గురయ్యారు. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన విల్సన్.. రింగ్ రోడ్లోని ట్రేడింగ్ సెంటర్కు పారిపోయాడు. అక్కడ ఓ సెలూన్లోకి ప్రవేశించి తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
కాగా.. సబిటికి మంత్రి ఎంగోలా కొన్ని నెలలుగా జీతం ఇవ్వడంలేదని వాపోయినట్లు స్థానికులు తెలిపారు. మంత్రి పిల్లలు స్కూలుకు వెళ్తున్నారని, కానీ తన పిల్లలు మాత్రం ఇంట్లోనే ఉండిపోయారని సబిటి ఎన్నోసార్లు చెప్పుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సబిటి భార్య గర్భవతి అని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.