దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ జరుగుతున్న అండర్ – 19 వరల్డ్ కప్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యువభారత జట్టులోని వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ 106 బంతుల్లో 118 పరుగులు చేశాడు. అదేవిధంగా కెప్టెన్ ఉదయ్ సహరన్ 84 బంతుల్లో 75 పరుగులతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది.
Read Also: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ పేరు మారుస్తూ ఉత్తర్వులు
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 17 పరుగులు చేసి విఫలమవగా, మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 32 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ముషీర్, ఉదయ్లు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
ఉదయ్, ముషీర్లు ఔట్ అయిన తర్వాత తెలంగాణ కుర్రాడు ఎరవెల్లి అవినాశ్ 13 బంతుల్లో 22 పరుగులు, సచిన దాస్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి భారత స్కోరును 300 మైలురాయిని దాటించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఒలీవర్ రిలే మూడు వికెట్లు తీయగా జాన్ మెక్నాలీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇదివరకే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గెలిచిన భారత్.. నేడూ గెలిస్తే సూపర్ 6 దశకు చేరుకుంటుంది.