అతను ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్. కానీ ఆ విషయాన్ని మరచి, పరిచయమైన మహిళతో అసభ్యప్రవర్తనకు దిగాడు. దాంతో ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగింది.
Read Also: ఫిబ్రవరి నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్!
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల మార్కెట్లో చేపట్టారు. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడ ఎన్నికల విధులు నిర్వహించారు. ఇదే చోట పోలీసు బందోబస్తు నిర్వహించిన కాకతీయ విశ్వవిద్యాలయం పీఎస్ ఎస్సై అనిల్.. సదరు మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె మొబైల్ నెంబరు తీసుకొని వాట్సాప్ ద్వారా మెసెజ్లు చేసేవాడు. ఆమె తన ఆఫీసుకు వెళ్లే సమయంలో కూడా వెంటపడేవాడు. ఓ సారి తన చెల్లెళ్లను పరిచయం చేస్తానని చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ‘నేను ఎస్సైని.. నాకు ఎవరూ ఎదురు చెప్పరు.. చెప్పినట్లు వినాలి’ అంటూ బెదిరింపులకు దిగాడు. ఆందోళనకు గురైన ఉద్యోగిని తన భర్తకు విషయం చెప్పింది. ఆయన ఎస్సైని నిలదీయంతో అంతు చూస్తానని ఆమె భర్తను కూడా బెదిరించాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించాడని బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో ఎస్సై అనిల్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మరో కేసు కూడా నమోదైంది.