రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడు జపాన్ పర్యటనకు వెళ్లినా అప్పుడు దేశంలో కరెన్సీపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటన వెలువడుతున్నదని ఎద్దేవా చేశారు. గతంలో ప్రధాని జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే దేశంలో రూ.1000 నోటును రద్దు చేశారని ఖర్గే గుర్తుచేశారు.
ఇప్పుడు ప్రధాని మరోసారి జపాన్కు వెళ్లాడని, ఈ క్రమంలోనే రూ.2000 నోటును వాపస్ తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవాళ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియా తనను చుట్టుముట్టి రూ.2000 నోట్ గురించి ప్రశ్నించగా ఖర్గే పైవిధంగా స్పందించారు.