జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో శనివారం ఉదయం నుండి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు అనంత్నాగ్లోనూ ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో పలువురు ఆర్మీ, పోలీసు సిబ్బంది వీరమరణం పొందారు. ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఆర్మీ అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు పటిష్టంగా సీజ్ చేసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: అనంత్నాగ్ ఎన్కౌంటర్ వీడియో వైరల్..డ్రోన్లతో ఉగ్రవాదులపై బాంబుల వర్షం..!!
సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్మూ కశ్మీర్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. అనంత్నాగ్ జిల్లా అడవుల్లో క్యాంప్ చేస్తున్న ఉగ్రవాదులను అదుపు చేసేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరుగుతోంది. అనంత్నాగ్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి, వారి రహస్య స్థావరాలపై డ్రోన్ బాంబులు, రాకెట్ లాంచర్లను కూడా పేల్చివేస్తున్నారు. సైన్యం ఈ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టింది. ఓ వైపు దట్టమైన అడవులు, మరో వైపు లోతైన లోయలు ఉండడంతో ఈ ఆపరేషన్ లో సైన్యానికి ఇబ్బందులు ఎదురైనా సైన్యం ముందుకు సాగుతోంది.
ఇది కూడా చదవండి: మరోసారి ‘నోబెల్’ ప్రైజ్ మనీ పెంపు..
ఉగ్రవాదులపై దాడులకు సంబంధించి డ్రోన్ దాడుల వీడియోలు బయటకు వచ్చాయి. అందులో డ్రోన్ నుండి బాంబు పేల్చిన తర్వాత ఒక ఉగ్రవాది పారిపోతున్నట్లు చూడవచ్చు. అయితే ఈ వీడియోలు అధికారికంగా విడుదల కాలేదు. కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఉగ్రవాదులపై సైన్యం, పోలీసులు నలువైపుల నుంచి దాడులు చేస్తున్నారు.