మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని 13 మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన గుణ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. గుణ-ఆరోన్ రహదారిపై డంపర్ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. మంటలకు 13 మంది సజీవదహనం అయ్యారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం నుంచి బయట పడిన నలుగురు ప్రయాణకులు మాత్రం క్షేమంగా ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థికసాయం ప్రకటించారు.