అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం చెందాడు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల-సత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్(21) బీటెక్ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం గతేడాది సెప్టెంబర్లో న్యూజెర్సీకి వెళ్లాడు. శనివారం అతడు కారులో వెళ్తుండగా.. సెల్టన్ కూడలి వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దాంతో శైలేష్ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగడంతో అతడు మంటల్లోనే సజీవ దహనమయ్యాడు. ఈ సమాచారాన్ని న్యూజెర్సీ అధికారులు మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శైలేష్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి విన్నవించారు.