ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ మృతితో ఆ రాష్ట్రంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా విధించారు.
ముఖ్తార్ అన్సారీ నిన్న(గురువారం) గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ మాత్రం తన తండ్రికి ‘స్లో పాయిజన్’ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ‘‘రెండురోజుల క్రితం నేను ఆయన్ని కలవడానికి వచ్చాను. నన్ను అనుమతించలేదు. ఆరోగ్యం బాలేకున్నా ఆసుపత్రి నుంచి ఆయన్ని జైలుకు తరలించారు. వైరలైన ఓ వీడియోలో ఆయన పొట్ట ఉబ్బినట్లు ఉండడం కనిపిస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చడానికి తీసుకొచ్చారు. కానీ, 12 గంటల తర్వాత తిరిగి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం’’ అని అన్నారు. అంతకుముందు ముఖ్తార్ సోదరుడైన గాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. అయితే పోలీసులు వీటిని ఖండించారు.
మరోవైపు అన్సారీ మృతి నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. జైలులో ఉన్న ఖైదీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పదంగా మరణించినప్పుడు సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని నిబంధనలు చెబుతున్నట్లు తెలిపారు. లేదంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్ను బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య గురువారం రాత్రి 8.25కు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కాసేపటికి మృతిచెందారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల కిందట మంగళవారం కూడా రోజంతా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇవాళ(శుక్రవారం) ఐదుగురు డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు వరుసగా ఎదురుదెబ్బలు..తాజాగా మరో షాక్..!