ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి .నిన్న(మంగళవారం) ఒక్కసారిగా బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన జడివాన కురిసింది. భారీ వర్షంతో వరదలు సంభవించాయి. దీంతో దుబాయ్ మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వరద ముంచెత్తింది. రన్వేపై మోకాళ్లలోతులో నీరు ఉండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దుబాయ్కు వచ్చే పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నారు.
ఇక వర్షాల కారణంగా భారత్- దుబాయ్ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు తెలిపారు. భారత్ నుంచి దుబాయ్ వెళ్లే 15 విమానాలు, దుబాయ్ నుంచి భారత్కు రావాల్సిన 13 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడే దుబాయ్ ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం.. 24గంటల్లోనే కురిసింది. గత 75ఏళ్లలో ఎన్నడూలేని విధంగా మంగళవారం జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం నీట మునిగింది. రన్వేపైకి భారీగా నీరు వచ్చి చేరింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: ఈ నెల 19న దేశంలో తొలి దశ ఎన్నికలు…నేటితో ముగిసిన ప్రచారం