అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాలతో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపాడు మండలం భీమవరంలో కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం భూమి రీసర్వే చేస్తుండగా మరోసారి వివాదం జరిగింది.
ఈ క్రమంలో రామరత్నారెడ్డి అనే వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మహిళతో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడికి పాల్పడిన వారు బాధితుడి దాయాదులేనని చెబుతున్నారు.