హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
ఆరు గ్యారంటీల లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని, ప్రస్తుతం ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 25వేల దరఖాస్తులు వచ్చాయని శ్రీధర్బాబు తెలిపారు.