ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ ఇకపై మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇవాళ( మంగళవారం) ప్రకటించింది. ఇప్పటి వరకు ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరు తమ పేరు మీద ఉన్న సర్టిఫికెట్ ను సమర్పించాలి. ఒకవేళ అడ్రస్ ధ్రువీకరణ లేకుంటే అడ్రస్ అప్డేట్ చేయడం సాధ్యంకాదు. ఇకపై ఈ ప్రక్రియ సులభతరం కానుంది. ఆధార్లో అడ్రస్ మార్చుకునేందుకు దరఖాస్తుదారు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న రేషన్కార్డ్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ వంటివి కూడా సమర్పించవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారు అడ్రస్ అప్డేట్ కోసం సమర్పించిన ధ్రువీకరణ పత్రం సరైంది కాకుంటే, ఉడాయ్ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద సెల్ప్ డిక్లరేషన్ సమర్పించాలి. దాన్ని పరిగణలోకి తీసుకుని దరఖాస్తుదారు ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేయబడుతుంది.
ఈ సేవల కోసం దరఖాస్తుదారు మై ఆధార్ పోర్టల్లోకి వెళ్లి రూ. 50 ఫీజు చెల్లించి, తమ కుటుంబ పెద్ద ఆధార్ నంబర్ టైప్ చేయాలి. తర్వాత ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) జారీ అవుతుంది. దరఖాస్తుదారు అడ్రస్ అప్డేట్ కోరినట్లు కుటుంబ పెద్ద ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబర్కు ఎస్సెమ్మెస్ ద్వారా మెసేజ్ పంపబడుతుంది. ఆ మెసేజ్ ను కుటుంబ పెద్ద ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఎస్ఆర్ఎన్ జారీ అయిన 30 రోజుల వ్యవధిలోపు పూర్తి కావాలి. ఒకవేళ కుటుంబ పెద్ద నిర్ణీత వ్యవధిలోపు అడ్రస్ అప్డేట్ కోసం పంపిన అభ్యర్థనను తిరస్కరించినా, ధ్రువీకరించకున్నా ఎస్ఆర్ఎన్ ముగిసిపోతుంది. దీంతో యూజర్ కొత్తగా మరో ఎస్ఆర్ఎన్ను ప్రారంభించాల్సి ఉంటుంది.