సినిమా హాళ్లలో తినుబండారాలు, కూల్డ్రింక్స్ విక్రయాల నిబంధనలను నిర్ణయించే హక్కు సినిమా హాల్ యజమానులకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. థియేటర్ల యజమానులు నిర్ణయించిన ధరలకే వాటిని ప్రేక్షకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
2018 లో జమ్ముకశ్మీర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
సినిమా హాలు ప్రైవేట్ ఆస్తి అని, అలాంటి నిబంధనలను ఆయా థియేటర్ల యాజమాన్యాలు విధించుకోవచ్చునని ధర్మాసనం పేర్కొన్నది. ప్రేక్షకుడు సినిమా హాల్లోకి ప్రవేశించే సమయంలో ఆయా సినిమా హాళ్ల యజమాని పేర్కొన్న నిబంధనలను పాటించాలని కోర్టు సూచించింది.
మల్టీప్లెక్స్లలో తినుబండారాలను విక్రయించడం అనేది వాణిజ్యపరమైన అంశం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లకు వచ్చే వారు తమ సొంత తినుబండారాలను తీసుకెళ్లేందుకు అనుమతించిన జమ్ముకశ్మీర్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కన పెట్టింది.