హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, సనత్నగర్, బేగంపేట, ఖైరతాబాద్, ట్యాంక్బండ్, లిబర్టీ, హిమాయత్నగర్ లలో జల్లులు పడ్డాయి. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణ గూడా, అఫ్జల్ గంజ్, గోశామహల్, మల్లెపల్లి, ఖైరతాబాద్లలో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాబాద్లో కూడా వర్షం కురిసింది. ఉదయం నుంచి నగరం మొత్తం వేఘావృతమై ఉన్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చిరుజల్లులు కురవడంతో గత వారం రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి నగర వాసులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
ఇదేవిధంగా ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో ఆగస్టు 12 నుంచి 14 వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.