ఓ చిన్నారిని అత్యాచారం చేసి చంపిన నిందితుడికి కేరళ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఎర్నాకుళం జిల్లా అలువాలో గత జూలై 28న ఓ ఐదేండ్ల చిన్నారిని అష్ఫక్ ఆలమ్ అనే 29 ఏండ్ల యువకుడి ఎత్తుకెళ్లాడు. అనంతరం పాపకు డ్రగ్స్ ఇచ్చి.. అత్యాచారం చేసి, హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసును విచారించిన ఎర్నాకుళం పోక్సో కోర్టు.. అష్ఫక్ ఆలమ్కు మరణశిక్ష విధించింది. ఈ కేసులో జడ్జి కే సోమన్ తన తీర్పును ఇవాళ వెలువరించారు. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్షమ అవసరం లేదని, సమాజానికి అతనో సమస్య అని కోర్టు తెలిపింది. 100 రోజుల పాటు ఆ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ తీర్పును వెల్లడించారు. ఆధారాలను ధ్వంసం చేసినందుకు అష్ఫక్కు అయిదేళ్ల జైలుశిక్ష విధించారు. మైనర్కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష, మైనర్ను రేప్ చేసినందుకు జీవితకాల జైలుశిక్ష, మర్డర్ చేసినందుకు మరణశిక్షను విధిస్తున్నట్లు న్యాయమూర్తి సోమన్ తెలిపారు. ఈ శిక్షలతో పాటు నిందితుడికి రూ. 7,70,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.