హైదరాబాద్: తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. మరోవైపు ఆంధ్రా చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లిస్తూ.. తెలంగాణ చేనేత సంఘాలపై వివక్ష చూపడం చర్చనీయాంశమైంది.
చేనేత ఉత్పత్తులకు నిలయమైన ఓరుగల్లు నుంచి ఆప్కో ద్వారా డిసెంబర్ 2021, మే 2022 సంవత్సరంలో కార్పెట్లు కొనుగోలు చేసిన ఏపీ ప్రభుత్వం.. వాటిని ప్రభుత్వ హాస్టళ్లల్లో విద్యార్థులకు అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 23 చేనేత సహకార సంఘాలు, కరీంనగర్ జిల్లాలోని 3 చేనేత సహకార సంఘాల నుంచి రూ.4కోట్ల 60లక్షల విలువైన కార్పెట్లను కొనుగోలు చేశారు. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో రూ.2కోట్ల 50లక్షల విలువైన బ్లాంకెట్లను కొనుగోలు చేశారు.
కాగా, ఈ సంఘాలకు సంబంధించిన బకాయిలు చెల్లింపులో మాత్రం ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కోట్లాది రూపాయల చెల్లించకుండా జాప్యం చేయడంపై నేత కార్మికులు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీరుతో తెలంగాణకు చెందిన పలు చేనేత సంఘాలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణ చేనేత కార్మికులకు చేతినిండా పని లేకుండా పోతుందని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు వాపోతున్నారు. మూడు నెలలకోకసారి ఏపీలోని విజయవాడకు వెళ్లి అధికారులను కలుస్తున్నా.. పట్టించుకోవడం లేదని షతరంజి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు యెలుగం సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు.