ప్రభుత్వం ఉద్యోగం సాధించడం కోసం లక్షల మంది విద్యార్థులు నిరంతరం కఠోర శ్రమ చేస్తూనే ఉంటారు. రాత్రి పగలు తేడా లేకుండా చదువుతూ, లక్షలు ఖర్చులు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఒకటి రెండు మార్కులతో మిస్ అయినా జాబ్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంటారు. కొంతమంది ఎన్నిసార్లు పరీక్షలు రాసినా సరైన గైడెన్స్ లేకపోవడంతో విఫలమవుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువతి మాత్రం ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. డిగ్రీ పూర్తికాగనే.. 2019 నుంచి ఇప్పటివరకూ ఏడు ఉద్యోగాలకు ఎంపికయింది. అయినా తన లక్ష్యం మాత్రం నెరవేరలేదని చెబుతోంది.
Read Also: ప్రియుడితో ఉన్న భార్యను కత్తితో నరికిచంపిన భర్త
ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అడ్వకేట్ అంబటి మురళీకృష్ణ కూతురు అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సస్లో జీఎస్టీ ఇన్స్పెక్టర్గా కొలువు సాధించింది. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)లో 2019లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం సాధించిన ఆమె అనంతరం కస్టమ్స్ విభాగంలో ట్యాక్స్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. గతేడాది మార్చిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్బేస్డ్ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్ ఉద్యోగం, భారత రైల్వేలో ఉన్నతాధికారిగా, పోస్టల్ విజిలెన్సు విభాగంలో మరో ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం ఎంపికయ్యారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఆరు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొలువులు వచ్చినా.. ఎప్పటికైనా సివిల్స్ సాధించి దేశసేవ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని కీర్తి ఉత్సాహంగా చెబుతోంది.