సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలను చిత్రీకరించే ఆర్. నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి నారాయణమూర్తికే ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్ అధికారింలోకి వచ్చిన తర్వాత నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు నారాయణమూర్తి. ఆ ప్రాజెక్టును జగన్ మంజూరు కూడా చేశారు. అంతటి సీఎం మంజూరు చేసిన తర్వాత ఇంకేముంది. త్వరలోనే ప్రాజెక్టు పూర్తవుతుందనుకున్నారు.
జగన్ కు చేతులెత్తి మొక్కారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని తాండవ జలాశయాల కాలువలను అనుసంధానిస్తే రెండు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 2021లో ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. టెండర్లు పిలిచి..గుత్తేదారుడినీ ఎంపిక చేసింది. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలో మిగతా సాగునీటి ప్రాజెక్టులకు పట్టిన గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేండ్లు కావాస్తున్నా అంగుళం కూడా ముందుకు సాగలేదు.