Friday, May 17, 2024

నేటి నుంచి ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు.. అప్లికేషన్ ఇలా నింపండి

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దాని కోసం ప్రభుత్వం ‘ప్రజాపాలన దరఖాస్తు’ ఫారాన్ని బుధవారం విడుదల చేసింది. ఇందులో నాలుగు పేజీలున్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. అయిదు పథకాల వివరాలు ఇందులో ఉన్నాయి. యువ వికాసం గురించి ఈ దరఖాస్తులో పేర్కొనలేదు. అయితే ఈ దరఖాస్తులో ఉన్న అయిదు పథకాలలో ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. అన్ని పథకాలకూ అర్హులైన వారు ఒకే దరఖాస్తులో ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

Read Also: ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు బాధితులు.. పిల్లల కోసం ఇలా చేయండి..

దరఖాస్తు ఫారం నింపే విధానం
తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్‌ ఫోన్‌ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి. ఇందులో దరఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు.. ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్‌ పెట్టాలి. కింద కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్‌ నంబర్లు పేర్కొనాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా రాయాలి. కుటుంబ వివరాల తర్వాత.. అయిదు పథకాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్‌ చేయడంతో పాటు అందులో అడిగిన వివరాలు రాయాలి.

1. మహాలక్ష్మి రూ.2,500 ఆర్థిక సహాయం: ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే అక్కడ బాక్సులో టిక్‌ పెట్టాలి. ఇదే పథకంలో భాగమైన రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధి పొందాలంటే.. గ్యాస్‌ కనెక్షన్‌ సంఖ్య, సిలిండర్‌ సరఫరా చేస్తున్న గ్యాస్‌ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు? అనే వివరాలు రాయాలి.

2. రైతుభరోసా: ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వ్యక్తి రైతా? కౌలు రైతా?.. అక్కడ టిక్‌ పెట్టాలి. పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు. సాగు చేస్తున్న భూమి సర్వే నంబరు, సాగు విస్తీర్ణం లెక్కలు రాయాలి. దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నంబరు రాయాలి.

3. ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులో టిక్‌ చేయాలి. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతోపాటు.. అమరుడి పేరు, ఆయన మృతి చెందిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్‌, డెత్‌ సర్టిఫికెట్‌ నంబరు వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులైతే ఎదుర్కొన్న కేసుల ఎఫ్‌ఐఆర్‌, సంవత్సరం, జైలుకు వెళితే ఆ సంవత్సరం, జైలు పేరు, శిక్షా కాలం వివరాలు అందించాలి.

4. గృహజ్యోతి: కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం కింద.. దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్తు వినియోగం వాడకం వివరాలు నింపాలి. ఇందులో 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు, 200 యూనిట్లపైన.. ఈ మూడింటిలో ఒక దాని ఎదురుగా టిక్‌ చేయాలి. గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ సంఖ్య రాయాలి.

5. చేయూత: ఇప్పటికే పింఛను అందుకుంటున్నవారు ‘చేయూత’ పథకానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పింఛను కోరుతున్నవారు మాత్రమే తమ వివరాలు ఇందులో రాయాలి. దివ్యాంగులైతే సంబంధిత బాక్సులో టిక్‌ చేసి సదరం సర్టిఫికెట్‌ సంఖ్య రాయాలి. ఇతరుల్లో.. వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదార్‌లలో.. ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్‌ చేయాలి.

చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ రాయాలి. నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామసభ, వార్డు సభల్లో సమర్పించాలి. దరఖాస్తు ఆఖరిపేజీలో కింది భాగంలో ‘ప్రజాపాలన దరఖాస్తు రసీదు’ ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాల బాక్సులో టిక్‌ చేసి, సంబంధిత అధికారి సంతకం చేసి మీకు రసీదు ఇస్తారు.

Latest News

More Articles