సరదాగా అలవాటైన గంజాయి వ్యసనానికి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన కే.సోమేశ్వర్రెడ్డి(22) హైదరాబాద్ కృష్ణానగర్లో నివాసం ఉంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుకుంటున్న సోమేశ్వర్రెడ్డికి గత కొంతకాలంగా స్నేహితుల కారణంగా గంజాయి అలవాటయింది.
తరచూ గంజాయి తీసుకోవడంతో పాటు దాన్ని అమ్మి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నిన్న(సోమవారం) అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని మెట్రోస్టేషన్ సమీపంలో గంజాయి అమ్మేందుకు వచ్చిన సోమేశ్వర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 170 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ(మంగళవారం) రిమాండ్కు తరలించారు.
ఇది కూడా చదవండి:తెలంగాణ నీటి వాటా తేలే వరకు విశ్రమించేది లేదు