రానున్న లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్న పార్టీ సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బండి మద్దతుదారులు బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో శనివారం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆ పైస్థాయి నాయకులంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి మద్దతుదారులు మాట్లాడుతూ.. గురువారం కరీంనగర్లోని ఓ హోటల్లో బండి సంజయ్ వ్యతిరేకులు సమావేశమైన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండికి పోటీచేసే అవకాశం ఇవ్వొద్దని అధిష్ఠానాన్ని కోరుతూ వారు ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకమాండ్ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. బండి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.