పార్లమెంటులో డిసెంబరు 13న కొంతమంది దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న కేంద్రప్రభుత్వం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలోకి దుండగులు ప్రవేశించి సృష్టించిన అలజడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో పార్లమెంట్ భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పార్లమెంట్ భవన సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి.
Read Also: ఆధార్తో ఆస్తుల అనుసంధానం! హైకోర్టు కీలక ఆదేశాలు
పార్లమెంట్ భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ సర్వే అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ భద్రతా బృందాలతో కలిసి ఈ వారాంతంలో సర్వే చేపట్టనున్నారు. సీఐఎస్ఎఫ్ ప్రస్తుతం ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు అణు, ఏరోస్పేస్ డొమైన్, సివిల్ ఎయిర్పోర్టులు, ఢిల్లీ మెట్రో వద్ద భద్రత కల్పిస్తోంది.