దేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ(సోమవారం) దేశంలోని పలు ప్రధాన ఎయిర్పోర్ట్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సోమవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే ఆయా విమానాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమెయిల్ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.
దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు, పలు విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: 14 సీట్లు గెలిచేందుకు కష్టపడుదాం