ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని.. ఆయనను చంపేంత అవసరం ఎవరికి లేదని కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ కనుమల్ల విజయ,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు అన్నారు.
నిన్న(మంగళవారం) ఈటలల దంపతులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ..ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల గడిచిన రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏం అభివృద్ధి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు రాగానే ప్రజల ముందు ఈటల దంపతులు మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై హత్య చేసే కుట్ర బీఆర్ ఎస్ పార్టీ చేస్తుందని బదనాం చేయడాన్ని వారు తప్పుపట్టారు. సొంత పార్టీ నాయకులే ఈటల ను పక్కన పెట్టడంతో.. భార్య భర్తలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఈటల దేవుళ్ళ భూములు,దళితుల భూములు కబ్జా చేశారని, ధరణి పోర్టల్ ద్వారానే మీరు కబ్జాకు పాల్పడ్డ భూములు బయటకు వచ్చాయి..అందుకే ధరణి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.