హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల బెదిరింపు లకు ఓ యువకుడు బలయ్యాడు. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ బాయ్స్ హాస్టల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన యువకుడు (22) బీటెక్ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్సు శిక్షణ కోసం నెల కిందట అమీర్పేట వచ్చాడు.
Also Read.. ఓ మహిళపై.. ఇద్దరు మహిళల లైంగికదాడి, ఆపై దోపిడీ
ఎస్సార్ నగర్ లోని శ్రీ లక్ష్మీనరసింహ బాయ్స్ హాస్టల్లో మరో నలుగురితో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఇటీవల అతనికి ఓ యువతి వాట్సప్లో వీడియో కాల్ చేయడంతో మాట్లాడాడు. సైబర్ నేర గాళ్లు ఆ కాల్ రికార్డును నగ్న వీడియోగా మార్ఫింగ్ చేసి పంపారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపిస్తామనడంతో ఓసారి రూ.10 వేలు పంపాడు. మరింత డబ్బు కావాలని వేధించడంతోపాటు కొంతమంది మిత్రులకు ఆ వీడియోలు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో ఉరేసుకొని తనువు చాలించాడు.