హైదరాబాద్: మద్యం మత్తులో కారు నడిపి పలు వాహనాలను ఢీట్టారు. అనంతరం తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ పరిసరాల్లో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించి పోలో కారుతో హల్ ఛల్ చేశారు. వేగంగా నడిపి రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లను, ద్విచక్రవాహనాలను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించి స్థానికులు కారును వెంబడించి ఎల్లమ్మ చెరువువద్ద అడ్డగించి ఆపారు.
కారులో మద్యమత్తులో ఉన్న యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగించారు. అయితే, స్థానికుల చేతిలో దెబ్బలుతిని గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.