Sunday, May 19, 2024

జాతీయస్థాయిలో ‘హరితహారం’కు గుర్తింపు.. మంత్రి కేటీఆర్ హ‌ర్షం

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంస్థ సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అడవుల పెంపకం, మునిసిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయిలో పర్యావరణ రంగంలో ఈ గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలన్న బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు  ప్రారంభించిన తన మానస పుత్రిక హరితహారం కార్యక్రమంతో పాటు అనేక పర్యావణహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కడం పట్ల మంత్రి కే. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరితహారంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా, అందులో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన విధానాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, ముఖ్యంగా పర్యావరణం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితమే తెలంగాణ దేశంలో అగ్రస్దానంలో నిలిచేందుకు కారణమన్న కేటీఆర్, ఈ సందర్భంగా పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా తోలినాళ్లలోనే కెసిఆర్ గారు, దీర్ఘదృష్టితో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, దాని అమలుకి చూపిన చంచలమైన కృషి వల్లనే ఈ ఘనత సాధ్యమైంది అన్నారు. భవిష్యత్తు తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం వలన అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని అనేక సంస్థలు పలుమార్లు గుర్తించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారంను చేపట్టిందని, గత తొమ్మిది సంవత్సరాలలో దాదాపు 273 కోట్ల మొక్కలను నాటమన్నారు. దాంతో 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్న విషయాన్ని కెటిఅర్ తెలిపారు.

అడవులతో పాటు సామాజిక వనాలను, పట్టణాలు, పల్లెలు అనే అంతరం లేకుండా పార్కులను విస్తృతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తాము తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో హరిత బడ్జెట్ అనే వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు15,000 నర్సరీలు, దాదాపు 19400 పైగా పల్లె ప్రకృతి వనాలు, 2725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణాల్లోనూ విస్తృతంగా 700 కోట్ల రూపాయలతో 180 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలితాలు ఫలించి హైదరాబాద్ నగరానికి వరల్డ్ ట్రీ సిటీగా  రెండుసార్లు గుర్తింపు లభించింది అన్నారు.

హరితహారంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణహితమైన అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి అత్యంత సవాలుగా నిలిచే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలోనూ అద్భుతమైన ప్రణాళికలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు పలు పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో వేస్ట్ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ దేశంలో ఈ రంగంలో రెండోస్ధానంలో నిలిచిందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్దితో కూడిన  ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది. సోలార్ ఉత్పత్తిలో చిన్న రాష్ట్రం అయినా దేశంలో రెండవస్ధానంలో నిలవడం తమ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు రావడం మరింత తమకు స్ఫూర్తిని ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనాలు, దేశానికే ఆదర్శం అంటూ నీతి అయోగ్ ప్రత్యేక ప్రశంసలు ఇవ్వడాన్ని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి కెసిఅర్  నిబద్ధతకి  దక్కుతున్న గుర్తింపు ఇది అన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసం తమ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

Latest News

More Articles