హైదరాబాద్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్-2023 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సెషన్లో భాగంగా ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించగా.. రెండో సెషన్లో భాగంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ శాట్ పరీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది సివిల్స్ పరీక్షల ద్వారా మొత్తం 1,105 పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్ లో తెలిపింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారని అంచనా.
కాగా, ఇవాళ్టి ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో పాలిటీ – 16, ఎన్విరాన్మెంట్ – 12, ఎకానమీ – 19, కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ పథకాలు, క్రీడలు – 5, సైన్స్ అండ్ టెక్నాలజీ – 10, జాగ్రఫీ – 20, చరిత్ర – 12, అంతర్జాతీయ సంబంధాలు – 6 ప్రశ్నల చొప్పున వచ్చాయని CSB ఐఏఎస్ అకాడమీ హెడ్ బాలలత తెలిపారు.
ప్రిలిమ్స్ కటాఫ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది జనరల్ అభ్యర్థులకు 86-91, EWS అభ్యర్థులకు 79-84, OBC అభ్యర్థులకు 85-89, SC అభ్యర్థులకు 72-76, ST అభ్యర్థులకు 68-74 కటాఫ్ మార్కులుగా ఉండే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.