ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఒక వ్యక్తి స్నేహితుడి చితిలోకి దూకి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్లా ఖంగార్ ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల అశోక్ కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ.. శనివారం ఉదయం మరణించాడు.
యమునా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ స్నేహితుడైన 40 ఏళ్ల ఆనంద్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అశోక్ మృతదేహానికి చితి వెలిగించిన తర్వాత.. ఒక్కసారిగా ఆనంద్ స్నేహితుడి చితిపైకి దూకాడు.
అక్కడున్నవారందరూ తొలుత షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకొని ఆనంద్ ను చితి పైనుంచి బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆనంద్ను తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ఆగ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు రిఫర్ చేశారు. అక్కడకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆనంద్ చనిపోయాడు.