నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు, 19 మండల కేంద్రాలకు, 3మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నిర్మల్ జిల్లాలో 396 గ్రామపంచాయతీలకు ప్రత్యేకంగా తలా రూ. 10 లక్షల చొప్పున నిధులు అందజేస్తామని చెప్పారు. అదే విధంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున ప్రకటించారు. అలాగే నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండల కేంద్రాల అభివృద్ధికి రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇటీవల విడుదలై పదో తరగతి ఫలితాల్లో మొత్తం తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్గా నిలిచిందని గుర్తుచేసిన కేసీఆర్.. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని టీచర్లను, విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే రోజుల్లో పునాది రాయి కోసం రాబోతున్నట్లు తెలిపారు.
ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో ఈవాళ నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. పేదల కోసం నిర్మించే 2 వేల డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకస్థాపనం చేశామని తెలిపారు. పేదవాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే తీరుతో ముందుకు పోదామని సీఎం పిలుపునిచ్చారు.