అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే దేశం వేగంగా పురోగమిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంశం ఎన్నో ఏండ్లుగా పెండింగ్లోనే ఉన్నదని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దానిని అమల్లోకి తెస్తామని చెప్పారు. దేశంలో పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పుట్టిందని, తమ జెండా.. ఎజెండా ప్రజల కోసమేనని స్పష్టంచేశారు. మాటలు చెప్తే అభివృద్ధి సాధ్యం కాదని.. కష్టపడి పనిచేస్తేనే సాధ్యమని.. ఇందుకు తెలంగాణ విజయగాథ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని మహారాష్ట్ర నుంచి ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలకు కూడా వెళ్తామని ప్రకటించారు. వారం- పది రోజుల్లోనే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెడుతామని పేర్కొన్నారు.
‘సూటిగా చెప్తున్నాం.. అతిత్వరలో ఢిల్లీలో సమావేశం ఏర్పాటుచేసి మహిళా విధానం ప్రకటిస్తాం. అన్ని రంగాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. గతంలో యూపీఏ ప్రభుత్వానికి ఈ విషయమై అనేక సలహాలిచ్చాం. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. కానీ దేశంలోని మహిళలందరికీ ఒక మాట చెబుతున్నా. మేం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల పార్లమెంట్ ఉభయసభల్లో, అన్ని రాష్ట్రాల విధాన సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతాం. ఆ అవసరం ఎంతో ఉన్నది. అందుకోసం మహిళల జనాభాకు అనుగుణంగా 33 శాతం రిజర్వేషన్ను చట్టసభల్లో అమలు చేస్తాం’ అని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.