ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోమవారం 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ నాలుగు స్థానాలకు నాలుగు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పెద్దగా మార్పులు, చేర్పులు లేవు అని సీఎం కేసీఆర్ తెలిపారు. కేవలం 7 మాత్రమే మారాయి. ఇందులోనూ కొందరు మంచి అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ ఎమ్మెల్యే అద్భుతమైన వ్యక్తి అని, అయితే ఆయన పౌరసత్వానికి సంబంధించి న్యాయవివాదం ఉన్న నేపథ్యంలో తప్పనిసరై మార్చాల్సి వస్తున్నది. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్లో అభ్యర్థులు మారారు. కామారెడ్డిలో స్వయంగా తానే పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందికి రాదు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తన ఆరోగ్య కారణాల దృష్ట్యా టికెట్ను ఆయన కుమారుడికి ఇవ్వాలని కోరారు. ఆయన విన్నపం మేరకు డాక్టర్ సంజయ్కి టికెట్ ఇస్తున్నాం. ఈసారి జాబితాలో మరో నాలుగు కొత్త ముఖాలు ఉన్నాయి. ములుగు జడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి ములుగు నియోజకవర్గంలో పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, హుజూరాబాద్లో ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి, దుబ్బాకలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ పెండింగ్లో ఉన్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో ఫైనల్ చేస్తాం.