హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతున్నది. దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో.. 15 అంతస్థుల్లో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనుంది.
రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, నాయకులకు సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా రూపొందించిన ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.