ప్రగతిభవన్ ముందు ఉన్న కంచెను తొలగిస్తున్న దృశ్యాలు గురువారం వైరల్ అయ్యాయి. కంచె తొలగించటాన్ని కొత్త ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కంచెను తాము తొలగించినట్టు ప్రకటించుకొన్నది. నూతన సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘ప్రగతిభవన్ ముందున్న కంచెను తొలగించాం. ఇక నుంచి అది ప్రగతిభవన్ కాదు.. ప్రజాభవన్. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జ్యోతిబాపూలే ప్రజాభవన్గా మారుస్తున్నాం. అక్కడ ప్రజాదర్బార్ కొనసాగుతుంది’ అని ప్రకటించారు. అసలు అక్కడ ఫెన్సింగ్ వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మరచిపోయారు కొత్త సీఎం. ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రగతిభవన్ ముందు తొలగిస్తున్న, తొలగించిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. కానీ, అదే సమయంలో అసలు ప్రగతిభవన్ ముందు ‘ముళ్ల కంచె వేసిందే కాంగ్రెస్ హయాంలో’ అంటూ అసలు విషయాన్ని అదే ప్రసార మాధ్యమాలు బయటపెట్టాయి.
Read also: రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ (కొత్తపేరు ప్రజాభవన్) ముందు కాంగ్రెస్ హయాంలోనే కంచె మొలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అనేక ముట్టడి కార్యక్రమాలకు పిలుపునివ్వటం, సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరిన అనేక సందర్భాల్లోనూ ముళ్లకంచె ఎదురయ్యేది. భారీ పోలీసు భద్రతా ఏర్పాట్ల దృశ్యాలు కోకొల్లలు. ‘అనుమతిలేనిదే లోనికి వెళ్లకూడదు.. లోనికి వెళ్లందే అనుమతి లభించదు’ అనే రీతిలో సీఎం క్యాంపు ఆఫీస్ ముందు వాతావరణం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కంచె మొలిచిందని గురువారం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.