న్యూఢిల్లీ: బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కుట్రలకు తెగబడుతుందని, తనపై ఎంత ఒత్తిడి చేసినా తాను బీజేపీకి తలవంచబోనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో చేరితే తనను కేసుల నుంచి బయటపడేస్తారని.. అయితే తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని వారికి తెలిపినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని రోహిణిలో ఓ పాఠశాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం ఏటా 40 శాతం బడ్జెట్ విద్యా, వైద్యానికి వెచ్చిస్తుందని, అదే సమయంలో మోడీ ప్రభుత్వం కేవలం బడ్జెట్లో 4 శాతమే కేటాయిస్తుందన్నారు. తమ సహచరులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను బీజేపీ పాలకులు కుట్రలు చేసి జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీలన్నీ ఇప్పుడు తన వెంట పడ్డాయని విమర్శించారు. ఢిల్లీ ప్రజల మద్దతులో బీజేపీ కుట్రలను భగ్నం చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.