మేడ్చల్ మల్కాజిగిరి: ఎన్నికల సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అయినా భయపడలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే విధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా తాము కార్యకర్తలను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్ లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎక్కడ సమస్య ఉన్న పరిష్కరించేదిశగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అందరం అప్రమత్తంగా ఉండాలని, కేసీఆర్ ఎవర్ని సూచించిన భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.