మహారాష్ట్రలోని హింగోలిలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని హింగోలిలో రెండు సార్లు భూకంపాలు సంభవించడంతో భయాందోళనలు వ్యాపించాయి. మొదటి భూకంపం ఉదయం 6.08 గంటలకు సంభవించింది. దీని తీవ్రత 4.5గా నమోదు అయ్యింది. రెండవ ప్రకంపనలు 6.19 నిమిషాలకు సంభవించాయి. దీని తీవ్రత 3.6గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వెంటవెంటనే రెండు సార్లు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
అటు మొన్న పాకిస్థాన్లో భూమి కంపించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భూకంపం సంభవించింది. రాజధాని క్వెట్టా, నోష్కీ, చాగి, చమన్, ఖిలా అబ్దుల్లా, దల్బాదిన్, పిషిన్, ప్రావిన్స్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదు. క్వెట్టాకు వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం, పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దు ప్రాంతాలలో కూడా భూకంపాలు సంభవించాయి. ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. ఇంతకు ముందు కూడా పాకిస్థాన్లో భూకంపాలు వచ్చాయి. వీటిల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భవనాలు, ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. 2021 అక్టోబర్లో బలూచిస్తాన్లోని హర్నై ప్రాంతంలో సంభవించిన భూకంపంలో 40 మంది మరణించారు. 300 మంది గాయపడ్డారు.