గజ్వేల్: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బిజెపిపై కాంగ్రెస్ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. .మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్లు, బిజెపి కేంద్ర మంత్రుల మెడలో నేడు పూలదండలు వేస్తున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Also Read.. ఖమ్మం జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి. 10 మందికి గాయాలు!
‘‘గజ్వేల్ లో కేసీఆర్ మంజూరు చేసిన పనులను ఆపడం ఇదెక్కడి పద్ధతి. మీకు చేతనైతే కేసీఆర్ చేసిన పనుల కంటే ఎక్కువ చేయండి. ఎక్కువ అభివృద్ధి చేయండి. గజ్వేల్లో కేసీఆర్ మంజూరు చేసిన పనులు ఆపితే గజ్వేల్ ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా. ఊళ్ళలో నాట్లు తక్కువ పడుతున్నాయి. నీళ్ళు, కరెంట్ ఇస్తరో లేదో అని అనుమానం పడుతున్నారు. పోయిన యాసంగితో పోల్చితే ఈసారి పంట సాగు తగ్గుతున్నది. ఆ వివరాలు ప్రజల ముందు పెట్టాలి. రైతుల్లో విశ్వాసం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాగు నీరు, కరెంట్, రైతు బంధు అందించాలి. సాగు పెంచాలి. కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే ప్రజల వద్దకు వస్తారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతాం. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయమందిస్తారు.
Also Read.. త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ..!
గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయండి, నేనే మీ వద్దకు వస్తాను భుజం కలిపి పోరాటం చేస్తాను. పోరాటాలు మనకు కొత్త కాదు. నేను అరెస్టు కానీ పోలీస్ స్టేషనే లేదు తెలంగాణలో.. అని అన్నారు.