మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన..సీఎం రేవంత్ మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమి లేదన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్పై వ్యక్తిగత దూషణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మేం మంత్రులుగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని రేవంత్ అన్నారు. మేం రాజీనామా చేసి బయటకు వచ్చిన 3 నెలలకు జీవో వచ్చింది. తెలంగాణకు అన్యాయం చేస్తే పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం. పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ 2005, సెప్టెంబర్ 13న జీవో తెచ్చారు. 2005, డిసెంబర్ 19వ తేదీన వైఎస్ మరోసారి జీవో తెచ్చారు. మేం 2005, జులై 4న వైఎస్ సర్కార్ నుంచి బయటకు వచ్చాం. మేం పదవుల కోసం పెదవులు మూసుకోలేదు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్, ఆయన మంత్రులేనని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు జీవోకు వ్యతిరేకంగా అసెంబ్లీని స్తంభింపజేశాం అని హరీశ్రావు గుర్తు చేశారు.
కేఆర్ఎంబీలో ప్రాజెక్టులను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ అధికారులు డ్యామ్పైకి వెళ్లాలంటే కేఆర్ఎంబీ అనుమతి కావాలి. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు అధికారులు ఒప్పుకున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని పత్రికల్లో వార్తలొచ్చాయి. వార్తలు తప్పు అయితే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు హరీశ్ రావు. ప్రాజెక్టులను అప్పగించడం నిజం కాకపోతే ఎందుకు స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై రేవంత్ రెడ్డికి సోయిలేదు. కేఆర్ఎంబీ సమావేశంలోనే ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారు కాబట్టే.. ఉద్యోగులు, వారికిచ్చే జీతాల ప్రస్తావన వచ్చింది. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించి దాన్ని మాయ చేసేందుకు రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కీలకమైన కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన మినిట్స్ను చెక్ చేసుకోవాలన్న సోయి కూడా లేదా..? మినిట్స్ తప్పుగా రాశారని చెప్పడం తప్పును కప్పిపుచ్చుకునే చర్య. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయి. అందుకే కేసీఆర్పై బురద జల్లేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులను అప్పగిస్తూ కేసీఆరే సంతకం చేశారని సీఎం చెప్పారు. అసలు కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు. ఇంతకంటే అబద్దాల ముఖ్యమంత్రి ఉంటారా..? అని అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై కేసీఆర్ స్పందించలేదని సీఎం చెప్పారు.. రాయలసీమ ఎత్తిపోతలపై స్టే తీసుకొచ్చిందే బీఆర్ఎస్ కదా..? కృష్ణాలో మన నీటి వాటా కోసం కేసీఆర్ పదేండ్లు పోరాడారని తెలిపారు హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. రేవంత్ అబద్దాలను ప్రజలు గుర్తించాలి. నాడు పోతిరెడ్డిపాడు విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెదపలేదు. పదవుల కోసం పార్టీ మారిన చరిత్ర మీది. ప్రజల కోసం త్యాగాలు చేసిన చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీది. ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా పని చేయాలి. తెలంగాణకు అన్యాయం చేస్తుంటే పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి వస్తాం. అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. ఢిల్లీకి వెళ్దామని సూచించారు. బేషజాలకు వెళ్లకుండా ప్రజలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్రావు.
ఇది కూడా చదవండి:యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపుతా అంటున్న కోమటిరెడ్డిని చెప్పులతో కొడతారు