హైదరాబాద్: జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. రవీంద్రభారతి, జర్నలిస్ట్ కాలనీ, జగన్నాథ్ టెంపుల్ జంక్షన్లను ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్లతో కలిసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విన్నపం మేరకు సిటీలోని కొన్ని జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రవీంద్ర భారతి జంక్షన్ వద్ద పాదాచారుల ప్రమాదాల నివారణకు ఫుట్పాత్ నిర్మాణం, జర్నలిస్ట్ కాలనీలో జంక్షన్ అభివృద్ధి చేయాలని, అదే విధంగా పోలీస్ శాఖ అధికారుల విజ్ఞాపన మేరకు జగన్నాథ టెంపుల్ జంక్షన్ వద్ద డివైడర్ పునర్నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్కు విన్నవించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆయా జంక్షన్లలో పలు పనులను చేపట్టేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ అధికారుల సూచన మేరకు పనులను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అంచనా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇ.ఎన్.సి, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.