Monday, May 20, 2024

రేషన్ డీలర్లకు సీఎం కేసీఆర్ గుడ్‎న్యూస్..

spot_img

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో జరిపిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. మెట్రిక్ టన్నుకు ప్రస్తుతమున్న కమీషన్ 900 రూపాయల నుండి 1400 రూపాయలకు పెంచుతున్నట్టు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్దీ చేకూరుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 139 కోట్ల అదనపు భారం పడుతుందని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాల్లోని ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని చూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రేషన్ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని మంత్రులు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కేవలం మెట్రిక్ టన్నుకు 200 రూపాయలు మాత్రమే వచ్చేదని.. ప్రస్తుతం దానిని 1400 రూపాయలకు పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వ కోటాకు అధనంగా ఇవ్వడం లేదని.. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని మొత్తం 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అదనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమీషన్ సైతం కేంద్రం పెంచుకున్నా.. తమ ప్రభుత్వం పెంచి అందిస్తుందన్నారు.

ఏకమొత్తంగా 1400 రూపాయలకు కమీషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్ షిప్ మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ డీలర్‎ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ షిప్ రెన్యూవల్ని 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్ షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంపు, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్‎ను కేసుల పరిధి నుండి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.

డీలర్ల కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‎కు రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు సమావేశంలోనే ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన రేషన్ డీలర్లు.. సచివాలయంలోని మీడియా సెంటర్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సీఎం కేసిఆర్ రేషన్ డీలర్ల విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. తమకు వచ్చే కమీషన్ క్వింటాల్‎కు 1400 రూపాయలకు పెంచారన్నారు. సెప్టెంబర్ 1నుంచి పెంచిన కమీషన్ ఇస్తామని చెప్పారన్నారు. ఆలస్యమైనా తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయిన డీలర్లను ప్రభుత్వం ఆదుకుంటామని తెలిపిందన్నారు. తమ సంఘాలకు ప్రభుత్వం గౌరవం పెంచిందని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు అన్నారు.

Latest News

More Articles