Friday, May 17, 2024

కోడ్ పేరిట గ్యారంటీల దాటవేతా?

spot_img

హైదరాబాద్: 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, మార్చి 17 తో వంద రోజులు పూర్తవుతాయని, జిల్లాల్లో పర్యటించినపుడు రైతు బంధు ఇంకా తమకు రాలేదని ప్రజలు పిర్యాదులు వస్తున్నాయని  మాజీ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో షెడ్యూల్ వచ్చే అవకాశముంది. కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ లోపే 6 గ్యారంటీల్లోని పదమూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బందేముండదు. శ్వేత పత్రాలు కూడా హామీల ఎగవేతల పత్రాలా అనే అనుమానం కలుగుతోంది ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పాం. ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి ఏమీ చేసినా ఫిబ్రవరి 20 వ తేదీ లోగానే చెయ్యాలన్నారు.

ప్రభుత్వం  ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక పోతే అన్నిటీకీ కోతలు తప్పవు. మరో కీలక మైన హామీ రైతులు పండించిన ధాన్యానికి  బోనస్ ప్రకటించడం. ఈ ఖరీఫ్ లో ఎలాగూ బోనస్ ఇవ్వలేదు. యాసంగి పంట కూడా పార్లమెంటు ఎన్నికల సమయం లోనే వస్తుంది. యాసంగి పంట కు బోనస్ పై ప్రభుత్వం ఇపుడే విధాన పరమైన నిర్ణయం తీసుకోకపోతే యాసంగి లో రైతులు నష్టపోతారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా,రైతు రుణమాఫీ,ఆసరా పెన్షన్ల పెంపు,200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలు ఇచ్చారు. డిసెంబర్ 9 గడిచిపోయినా  వాటి అమలు కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

రైతు బంధు డబ్బుల పై మా ప్రభుత్వం  అపుడు ప్రతి రోజూ ప్రెస్ నోట్ ఇచ్చేది. అసెంబ్లీ లో శ్వేత పత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బుల పై ప్రతి రోజూ ప్రెస్ నోట్ ఇవ్వడం లో ఇబ్బంది ఏమిటీ ? ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత ఎగవేత అన్నట్టుగా ఉంది. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఎంత మందికి వర్తించిందో వివరాలు ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వ హాయ్యంలోనే పది లక్షల ఆరోగ్యశ్రీ అమలయ్యింది. ఈ ప్రభుత్వం చేయబోయే అప్పును కూడా మొన్నటి శ్వేత పత్రంలో చూపించారు. ఆర్బీఐకి 13 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని వార్తలు చూశా. డిసెంబర్ లో 1400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారని తెలిసింది. నిరుద్యోగ భృతి పై డిప్యూటీ సీఎం భట్టి రాహుల్ ,ప్రియాంక ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మాట్లాడారని గుర్తుచేశారు.

జాబ్ కేలండర్ ప్రకటించిన వాళ్ళు ఇప్పట్నుంచే మార్గ దర్శకత్వాలు రూపొందించుకోవాలి కదా. గ్యారంటీలు ఇచ్చినపుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా. ప్రజల్లో గ్యారంటీలపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని మాట్లాడటం తగదు. ప్రభుత్వం దాచడం ఏమి ఉంటుంది ? బులెట్ ప్రూఫ్ కోసం వాహనాలను ఎవ్వరైనా విజయవాడకు పంపాల్సిందే. అవి సీఎం వాడుకోరా ?ప్రభుత్వం వాడుకోదా ? ప్రగతి భవన్ లో అన్ని రూం లు ఇన్ని రూంలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఇపుడు డిప్యూటీ సీఎం మిగతా వారు ప్రగతి భవన్ లో ఉంటున్నారు కదా..వారు ఇపుడు చెప్పాలి ..ఎన్ని రూం లు ఉన్నాయో. పార్లమెంటు ఎన్నికల లోపు కాంగ్రెస్ గ్యారంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవో లు విడుదల చేయాలి. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితేనే గ్యారంటీలు సరిగా అమలవుతాయి ..లేక పోతే అన్నిటికీ కోతలే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటో కాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు.

నర్సాపూర్ ,జనగామ ,హుజురాబాద్ ,సంగారెడ్డి నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోంది. అసెంబ్లీ లో సీఎం ఏం చెప్పారు. 119 ఎమ్మెల్యేలను సమాన ద్రుష్టి తో చూస్తామని చెప్పారు. ఇపుడు ఏం జరుగుతోంది. మేము అధికారంలో ఉన్నపుడు ప్రోటో కాల్ ఉల్లంఘించలేదు. పార్లమెంటు ఎన్నికలకు మా వ్యూహాలు మాకు ఉన్నాయన్నారు.

Latest News

More Articles