కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సోషల్ మీడియా ఎక్క్ వేదికగా ట్వీట్ చేస్తూ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ట్వీట్ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు క్రిశాంక్ ను అదుపులోకి తీసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేయడంతోపాటు, ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిశాంక్, ఇతర బీఆర్ఎస్వీ నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ నిన్న(బుదవారం) ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 469, 465, 468, 417, 471, 505 (1) (బీ),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఓయూ పోలీసులు.
బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర మన్నె క్రిశాంక్ ను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత క్రిశాంక్ను ఓయూ పోలీసులకు అప్పగించగా, ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఈస్ట్ మారేడ్పల్లిలోని మెజిస్ట్రేట్ నివాసానికి తరలించేందుకు అన్నీ సిద్ధం చేశారు. కానీ మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో అప్పటి వరకు క్రిశాంక్ను నల్లకుంట పోలీస్స్టేషన్లో ఉంచినట్టు తెలుస్తోంది. క్రిశాంక్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఆ తర్వాత సాయంత్రం 5.40 గంటలకు అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రిమాండ్ రిపోర్టులో క్రిశాంక్పై 2011 నుంచి నమోదైన దాదాపు 14 కేసులూ బనాయించారు పోలీసులు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగులు తొలగింపు.!