చండీగఢ్: హర్యానా గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన జరిగింది. రాముడి వేషం ధరించిన ఓ బాల కళాకారుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ నమస్కరించారు. కర్నల్ నగరంలోని మైదానంలో జెండా వందనం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు వేశారు.
వేదికపై ఉన్న సీఎం ఖట్టర్ వెంటనే వారి దగ్గరికి వెళ్లారు. రాముడి వేషధారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ బాల కళాకారుల ప్రదర్శనకు భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. అందుకే రాముడి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నట్లు ఖట్టర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.