తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు కూడా పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. తోతట్టు ప్రాంతాల ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిన్న(గురువారం) కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అయితే… ఇవాళ కురిసిన భారీ వర్షానికి తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లో మాత్రం రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అంతేకాకుండా.. రాబోయే ఐదు రోజుల పాటు రాయలసీమ, కేరళలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: కుప్పకూలిన కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన