కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరువచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలు మూసివేసింది. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి, అలప్పుజాలోని చేర్యాల, చెంగన్నూర్ సహా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో వరదల కారణంగా 17 సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వాటిలో దాదాపు 246 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.
మరోవైపు కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఇవాళ(మంగళవారం) ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీనికి సంబంధించి నాలుగు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా హై రేంజ్లో నివసించే ప్రజలు అలర్ట్ గా ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచించింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఖేల్ ఖతం.. మత పిచ్చి పార్టీ బీజేపీ