ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజంగా ధర్మరాజే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది.. మీ ఓటులోనూ ధర్మం ఉండాలి. 50 వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వరన్నను గెలిపించాలి. అప్పుడే ధర్మం ఉన్నట్లు లెక్క.. లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే అని కేటీఆర్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వెంకటేష్ నేత మాట్లాడుతూ ధర్మపురి ధర్మరాజు కొప్పుల ఈశ్వర్ అని అన్నారు.. నిజంగా కూడా ఈశ్వరన్న చల్లటి మనిషి, సౌమ్యుడు, మృదుస్వభావి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎప్పుడన్న ఏందన్నా అడిగినా.. అవతలి వాళ్లు ఏదన్న నొచ్చుకుంటారేమోనని చెప్పి మెల్లగా అడిగే నాయకుడు కొప్పుల ఈశ్వరన్న. నాకు తెలిసి ఇంత సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం, ఇంత ఉన్నత స్థానానికి రావడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి తన కేరీర్ చూస్తే 1976, నవంబర్లో 17 ఏండ్ల వయసులో సింగరేణిలో పని చేయడం ప్రారంభించారు. 1976 నుంచి దాదాపు 26 ఏండ్లు సిగరేణిలో పని చేశారు.
అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చానని ఈశ్వరన్న చెప్పారు. అల్టిమేట్గా కేసీఆర్ ఆశీర్వాదంతో, ప్రజల ప్రేమతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్తే గొప్పగా అనిపించింది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి, కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి.. 22 ఏండ్ల కిందట కేసీఆర్తో తమ్ముడిలా అటాచ్ అయిన తర్వాత.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఎత్తులు పల్లాలు చూశారు. కొన్ని సందర్భాల్లో ఓడిపోయారు.. కొన్ని సందర్భాల్లో గెలిచారు. కానీ ఈశ్వరన్న గొప్పదనం ఏంటంటే.. గెలిచినా, ఓడినా, అన్నింట్లో కేసీఆర్కు ఒక తమ్ముడిలా, నిబద్ధత కలిగిన సైనికుడిలా కలిసిమెలిసి ఉన్నారని కేటీఆర్ కొనియాడారు.