దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్లోని లర్కిపోరాలో బుధవారం ఓ వాహనంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
అనంత్నాగ్ నుండి అందిన సమాచారం ప్రకారం, టాటా మొబైల్ వాహనంలో (JK18-4476) లర్కిపోర దురు నుండి ఒక బృందం వెళ్తుండగా ఈ పేలుడు జరిగింది. లర్కిపోరాలో వాహనంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు.పేలుడు సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు, సమీప ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్థానిక ప్రజల సహాయంతో గాయపడిన కార్మికులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన కార్మికులందరూ కాశ్మీరీయేతరులు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినవారు. పేలుడు ధాటికి వాహనం కూడా ధ్వంసమైంది. కూలీల వాహనం వద్ద ఉన్న సిమెంట్ మిక్స్ సెంటరింగ్ వైబ్రేషన్ మిషన్లో పేలుడు సంభవించిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.