Friday, May 17, 2024

దసరాతో టీఎస్‌ఆర్టీసీకి భారీ ఆదాయం.. 11 రోజుల్లోనే రూ. 25 కోట్లు

spot_img

తెలంగాణలో దసరా పండుగ టీఎస్ ఆర్టీసీకి కోట్ల రూపాయల లాభం తీసుకొచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. కేవలం 11 రోజుల్లోనే ఆర్టీసీ ఖజానాకు దాదాపు రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పండుగను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు టీఎస్‌ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులను నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 ప్రత్యేక బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు నగరంలోని అన్ని పికప్‌ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే పండుగ సందర్భంగా అదనపు వసూళ్లు చేయకుండా.. ఈసారి కూడా టీఎస్ ఆర్టీసీ సాధారణ చార్జీలనే వసూలు చేసింది.

Read Also: 2018 తెలంగాణ ఎన్నికల్లో తూటాలా పేలిన నోటా.. ఐదుగురి తలరాత తలకిందులు

అయితే.. ఈసారి టీఎస్ ఆర్టీసీ కూడా డైనమిక్ చార్జీలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా డైనమిక్ ఫేర్‌నే వినియోగిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోలిస్తే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. పండుగ సందర్భంగా అక్టోబర్ 13 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపగా.. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా ఆర్టీసీకి రోజుకు దాదాపు 12 నుంచి 13 కోట్ల ఆదాయం వస్తుంటే… దసరా పండుగకు మాత్రం రోజుకు 2 నుంచి 3 కోట్లు అదనంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులో అత్యధికంగా 19 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత 11 రోజుల్లో ఆర్టీసీకి 25 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మండలానికి సగటున 2 కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Latest News

More Articles