హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుంది. అటు రెసిడెన్షియల్ మార్కెట్లో.. ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బెంగళూరును మించి హైదరాబాద్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగిందని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ వెస్టియన్ తమ తాజా నివేదికలో స్పష్టం చేసింది.
సుస్థిర ప్రభుత్వం.. సుపరిపాలన.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు.. రియల్ ఎస్టేట్ దూకుడుకూ ఇదే కారణమని పేర్కొంది. హైదరాబాద్సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ లీజింగ్పై ఓ రిపోర్టును విడుదల చేసింది. లీజింగ్ 21 శాతం, కొత్త సైప్లె 26 శాతం పెరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు.
Also Read.. కాంగ్రెస్లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. బెంగళూరు ఆఫీస్ స్పేస్ లీజులు 36 లక్షల చదరపు అడుగులకే పరిమితం కాగా, కొత్తగా వచ్చిన ఆఫీస్ స్పేస్ సైతం 25 శాతం పడిపోయి 27 లక్షల చదరపు అడుగుల వద్దే ఉన్నది. ఇదే సమయంలో హైదరాబాద్లో ఈసారి 37 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్, 55 లక్షల్లో కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది.
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లోనే ఎక్కువగా ఆఫీస్ స్పేస్కు గిరాకీ ఉంది. మొత్తం మార్కెట్లో 25 శాతం వాటా దీనిదే అని నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీల వాటా 20 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజుల్లో తయారీ, ఇంజినీరింగ్ రంగాల వాటా 17 శాతం. ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీల వాటా 16 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు.